420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు ఏమయ్యాయి?
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్.. తహసీల్దార్కు వినతిపత్రం
- ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్
పటాన్చెరు, : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పటాన్చెరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని విమర్శించారు. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు గడుస్తున్నా హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతర పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


