పటాన్చెరులో జాతీయ రహదారిపై నిరసన ధర్నా
- బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల అమానుష వైఖరి
- నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లడం నేరమా? – బీఆర్ఎస్ నేతల ప్రశ్న
పటాన్చెరు, : అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు నల్ల దుస్తులు ధరించి హాజరవుతున్న తమ పార్టీ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం నేరమా? అని వారు ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


