జీవో 97 రద్దు చేయాల్సిందే పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్
బెల్లంపల్లి, : పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శనివారం బి ఆర్ ఎస్, బి ఆర్ ఎస్వి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు.జీవో 97 అమలుతో పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, ప్రస్తుత విద్యా వ్యవస్థపై స్పష్టత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిప్లొమా పూర్తిచేసిన తర్వాత ఈసెట్ ద్వారా బీటెక్లో లేటరల్ ఎంట్రీ, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ వ్యవస్థలోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులో ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విద్యార్థులపై ఆర్థిక భారం వంటి అంశాలపై అనిశ్చితి నెలకొంటుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ, ఎస్బీటీఈటీ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.జీవో 97ను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇదే డిమాండ్తో నిరసనలు కొనసాగిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


