ఆదిలాబాద్ మున్సిపాల్టీ కి మంజూరైన నాలుగు ట్రాక్టర్లను
ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, చైర్మన్ బండారి అనూష సతీష్..
ఆదిలాబాద్ : అదిలాబాద్ మున్సిపాలిటీకి 15th ఫైనాన్స్ నిధులతో సుమారు రూ.36 లక్షల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు ట్రాక్టర్లను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషా సతీష్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ల తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషా సతీష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన వాహనాలను సమకూరుస్తున్నామని తెలిపారు.గత రెండు నెలల క్రితమే ఒక నూతన జేసీబీ, ఒక బ్లేడ్ ట్రాక్టర్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఆరు చిన్న ఈ టాటా ఏస్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రస్తుతం అవి టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 133 మున్సిపాలిటీలకు కలిపి సుమారు రూ.2,780 కోట్ల టీ యు ఎఫ్ ఐ డి సి, యు ఐ డి ఎఫ్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో భాగంగా అదిలాబాద్ మున్సిపాలిటీకి కూడా వివిధ అభివృద్ధి పనుల కోసం 18 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వాటితో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా మరో రూ.43 కోట్ల టీ యు ఎఫ్ ఐ డి సి నిధుల పనులు ప్రస్తుతం ఆన్లైన్ టెండర్ దశలో ఉన్నాయని, మరో వారం నుంచి పది రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అదిలాబాద్ మున్సిపాలిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి 154 కోట్ల అభివృద్ధి పనుల కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అందులో నుండి మరో రూ.50 కోట్ల నిధులు రానున్నాయని చైర్పర్సన్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదిలాబాద్ మున్సిపాలిటీలో రాబోయే రోజుల్లో ఎక్కడా అభివృద్ధి పనులు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకుంటామని, 49 వార్డుల్లోనూ సరిసమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడతామని బండారి అనూషా సతీష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ , మున్సిపల్ కమిషనర్ జగదీశ్ గౌడ్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ , కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎజ్జగిరి సంజయ్ , 40వ వార్డు కౌన్సిలర్ చరణ్ గౌడ్ ,టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎనగంటి ప్రకాష్, మున్సిపల్ బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం తదితర పార్టీల కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


