ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిలబెట్టుకోవాలి: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
- మునిగడప జెడ్పీహెచ్ఎస్ తెలుగు ఉపాధ్యాయులు ఆదరాజుపల్లి మధుసూదన్ శర్మ ఉద్యోగ విరమణ సభ
- - హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి
గజ్వేల్/సిద్దిపేట జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మునిగడప గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం తెలుగు ఉపాధ్యాయుడిగా సేవాలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆదరాజుపల్లి మధుసూదన్ శర్మ అభినందన సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే మెరుగైన పిఆర్సి అమలు చేస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. మేము కొత్తగా ఏమీ కోరడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే నవంబర్ 1న యాభై వేల మందితో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే స్పందించి మెరుగైన పిఆర్సి ప్రకటించకపోతే, సిపిఎస్ రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్ శర్మ సేవల గురించి ప్రసంగిస్తూ... ఉత్తమ ఉపాధ్యాయుడు, నిబద్ధత కలిగిన తెలుగు పండితుడు మధుసూదన్ శర్మ నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఇదే పాఠశాలలో 16 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరుకావడమే ఆయన అందించిన నిష్కల్మషమైన సేవలకు నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పి.ఆర్.టి.యు.టి.ఎస్. అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... దశాబ్దాలకు పైగా విద్యా రంగం ద్వారా సమాజానికి విశేష సేవలు అందించిన మధుసూదన శర్మ సేవలు అభినందనీయమని కొనియాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ నెల రోజుల వ్యవధిలోనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు. అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, రాష్ట్ర పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, పిఆర్టియు రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిఆర్టియు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసు పల్లి శశిధర్, పత్రిక సంపాదక వర్గ సభ్యులు, పిన్నింటి రామకృష్ణారెడ్డి, మండల విద్యాధికారి సైదులు, పిఆర్టియు జగదేవపూర్ మండల శాఖ అధ్యక్షులు చిలుకూరు వెంకటరామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్, అసోసియేట్ అధ్యక్షులు వంగ శ్రీనివాస్ రెడ్డి, కే ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు ఎండి రహీం, సుగుణాకర్, ఉపాధ్యాయులు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


