గజ్వేల్ లో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
గజ్వేల్ / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ప్రకటనలో తెలిపారు. తేదీ 02 సెప్టెంబర్ 2026 న ఇన్స్పెక్టర్ రవికుమార్ కి శ్రీగిరిపల్లి గ్రామ శివారులోని ఓపెన్ ప్లేస్లో కొంతమంది వ్యక్తులు గంజాయిని ఇతరులకు విక్రయిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సై మల్లారెడ్డి సిబ్బందితో కలిసి మధ్యాహ్నం సుమారు 01:00 గంటల సమయంలో పెట్రో కార్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి అక్కడ ఉన్న వారిలో ఒకరు పారిపోగా, మిగిలిన నలుగురు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల వివరాలు: టంగుటూరి శివానంద్ (తండ్రి: శంకర్, నివాసం: రామాలయం స్ట్రీట్, గజ్వేల్), దయ్యాల విజయ్ (వయస్సు: 23 సంవత్సరాలు, తండ్రి: భీమయ్య, నివాసం: ఎస్సీ కాలనీ, గజ్వేల్ టౌన్), పోతరాజు అజయ్ (వయస్సు: 20 సంవత్సరాలు, తండ్రి: మల్లేష్, నివాసం: పిడిచెడ్ గ్రామం), చిక్కుడు అనిల్ (తండ్రి: గోపాల్, నివాసం: చిక్కుడు బస్తి, గజ్వేల్ పట్టణం), పారిపోయిన వ్యక్తి వివరాలు: తేజ (నివాసం: డబుల్ బెడ్ రూమ్, గజ్వేల్ పట్టణం) పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, వీరు కొంతకాలంగా జగదేవ్పూర్ మండలం, మునిగడప గ్రామానికి చెందిన దేవుని నవీన్ అనే వ్యక్తి వద్ద నుంచి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గజ్వేల్ పట్టణంలోని పలువురికి విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల వద్ద నుంచి సుమారు 750 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంలో భాగస్వాములైన ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, పట్టుబడిన నలుగురిని అర్ధరాత్రి రిమాండ్కు తరలించారు. పారిపోయిన నిందితుడు తేజ మరియు గంజాయి సరఫరాదారు దేవుని నవీన్ ల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. చట్టవిరుద్ధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా లేదా వినియోగించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


