తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాముకు టీయూజేఏసీ విజ్ఞప్తి
హైదరాబాద్, : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీయూజేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో ప్రతినిధులు తార్నాకలోని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ నివాసంలో ఆయనను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం మొత్తం 14 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఉద్యమంలో 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాల్గొన్న వారిని గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి నెలా రూ.25 వేల గౌరవ పెన్షన్ అందించాలని కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, రూ.50 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని, ఉద్యమకారుల పిల్లలకు ఉద్యోగావకాశాల్లో 75 శాతం కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఉద్యమకారుల పేరుతో ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఉద్యమకారులకు 50 లక్షల సామూహిక బీమా ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వం నిర్వహించే పథకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యేక స్థానం కల్పించాలని, భార్యాభర్తల్లో ఒకరికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.1969 నుంచి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి, వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహాయం అందించాలని టీయూజేఏసీ కోరింది. ఉద్యమకారుల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు టీయూజేఏసీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో టీయూజేఏసీ నాయకులు మోత్కూర్ మల్లేష్, భువనగిరి యాదగిరి, మహమ్మద్ షాజహాన్, రాజమ్మద్ తదితర తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


