పొంగులేటి ఆనందం కోసం బీసీ ఆడబిడ్డను బలి చేశారు
- కాంగ్రెస్కు బీసీలంటే ఎందుకింత వివక్ష?
- బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్
కాటారం (భూపాలపల్లి ) : పొంగులేటి కోసం బీసీ ఆడబిడ్డను బలి పశువును చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఇంజమూరి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం బీసీలపై కాంగ్రెస్ వైఖరికి నిదర్శనమన్నారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడంతో పాటు కేంద్ర మంత్రి వర్గంలో 27 శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణలో బీసీలు రాజకీయంగా ఎదగాలని కోరుకునే పార్టీ బీజేపీ మాత్రమేనని, 2028లో తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేసే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించబడిన కొండా సురేఖకు తెలంగాణ బీసీ సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీలంతా ఏకమై బీజేపీకి మద్దతుగా నిలవాలని శ్రీశైలం యాదవ్ కోరారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్, జిల్లా నాయకుడు దుర్గం తిరుపతి, ప్రధాన కార్యదర్శులు మంత్రి సునీల్, బొంతల రవి, ఉపాధ్యక్షుడు ఇంజమూరి సదానందం, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జాడి లక్ష్మణ్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


