మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగింపు
బీసీలకు అవమానమే: వేముల సత్యశీలసాగర్
నాగర్ కర్నూల్ ,బిజినపల్లి, : మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది బీసీ మహిళా నేతపై వివక్షేనని మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్ అన్నారు. గురువారం బిజినపల్లి మండలంలో ఏర్పాటు చేసిన బీసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత అయిన కొండా సురేఖను వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. తన శాఖలో నిర్ణయాలు తనకు తెలియకుండా సీఎంఓ నుంచి జరుగుతున్నాయని, తనను నామమాత్రపు మంత్రిగా మార్చారని సురేఖ స్వయంగా హైకమాండ్ కు లేఖ రాసి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కూతురు వ్యాఖ్యలకు తల్లిని శిక్షించడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. 42% బీసీ రిజర్వేషన్ అంటూనే బీసీ మహిళా మంత్రిని తొలగించడం బీసీ సమాజాన్ని అవమానించడమేనన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల సత్తా అగ్రవర్ణాలకు చూపిస్తామని, బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కొండా సురేఖకు బీసీ సంఘాలు పూర్తిగా అండగా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ అంతటి రాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు దాసర్ల వెంకటస్వామి, జిల్లా నాయకులు దన్నోజ్ అరవింద్ చారి, పిట్టల తిరుపతయ్య, నక్క పర్వతాలు యాదవ్, కాటామోని శ్రీనివాస్ యాదవ్, మందడి యాదయ్య, పాపని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


