అధికార బలంతో దళితుల భూములపై అక్రమ మార్పులు..?
సీలింగ్ భూములపై సమగ్ర విచారణకు కలెక్టర్ను ఆశ్రయించిన వృద్ధ రైతు
కొత్తపల్లి: కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 90, 91, 95, 109లకు సంబంధించిన భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వృద్ధ రైతు కూర సత్యనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవలే జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. వినతిపత్రం ద్వారా కోరిన ఆయా సర్వే నంబర్లలోని భూములకు సంబంధించి గతంలో సీలింగ్ ప్రక్రియలో భూముల పంపిణీ జరిగిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పట్టాలు, పహాణీలు, ఆన్లైన్ రికార్డుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. సర్వే నంబర్ 109లో మొత్తం 2 ఎకరాల 23 గుంటల భూమి ఉండగా, అందులో కొంత భూమి సీలింగ్లో హరిజనులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అధికార బలాన్ని ఉపయోగించుకుని ఆ భూమిలో కొంత భాగాన్నితన కుటుంబ సభ్యుల పేర్లపైకి మార్చుకున్నారని, దీనివల్ల దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత సీలింగ్ ప్రొసీడింగ్స్, రెవెన్యూ రికార్డులు, పట్టాలు, పహాణీలు, ఆన్లైన్ వివరాలను సమగ్రంగా పరిశీలించి నిజానిజాలు తేల్చాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే సర్వే నంబర్ 90లో 8 ఎకరాల 15 గుంటల భూమి జాయింట్ పట్టాలో ఉందని, సర్వే నంబర్ 91లో తన కుటుంబానికి సంబంధించిన భూములపై వివాదం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం సర్వే నంబర్ 91లో 1 ఎకరం 33 గుంటలు, సర్వే నంబర్ 95లో 6 గుంటలు, సర్వే నంబర్ 90లో 4 ఎకరాల 7 గుంటలు కలిపి సుమారు 8 ఎకరాల భూమిని సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్లు 90, 91, 95, 109లకు సంబంధించిన పట్టాలు, సీలింగ్ ప్రొసీడింగ్స్, పహాణీలు, ఆన్లైన్, ఇతర రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే స్థల పరిశీలన నిర్వహించాలని కోరారు. సీలింగ్లో దళితులకు పంపిణీ చేసిన భూములు ఏవి, ప్రస్తుతం ఆ భూములు ఎవరి పేర్లపై నమోదై ఉన్నాయనే అంశంపై విచారణ జరిపి, దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, తనకు చట్టబద్ధంగా హక్కు ఉన్న భూమిపై న్యాయం చేయాలని అధికారులను కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


