పారదర్శకంగా ‘SIR-2026’ నోటీసుల పరిష్కారం
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి
గండిపేట (రంగారెడ్డి): రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నోటీసుల హియరింగ్, పరిష్కార ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, హైదర్షాకోట్ ప్రాంతాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రికార్డుల పరిశీలన, ధృవీకరణ విధానాన్ని, ఓటర్లు సమర్పించిన పత్రాలను సీఈఓ స్వయంగా తనిఖీ చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.రికార్డుల ధృవీకరణ: జిల్లాలో ‘నో మ్యాపింగ్’,‘అనామలీస్’కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఆధారాల పరిశీలన: హియరింగ్కు హాజరయ్యే వ్యక్తుల వివరాలు, వారు సమర్పించే ఆధారాలను నిబంధనల ప్రకారం ధృవీకరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలి. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కార్యాచరణ ప్రణాళిక: నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించి, ప్రామాణిక విధానాలు, రోజువారీ లక్ష్యాలతో ముందుకు సాగాలి. విధుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ తనిఖీల్లో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


