చదువుతో పాటు నైపుణ్యం..
ఐటీఐలో చేరేందుకు మరో అవకాశం!
- ఆగస్టు 29 నుంచి వాక్ఇన్ అడ్మిషన్లు!
- సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం
కొత్తగూడెం : విద్యా సంవత్సరానికి ఎటిసి , ప్రభుత్వ ఐటీఐ, ఆర్ ఐ టి ఐ , మైనారిటీ ఐటీఐ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు మూడో దశ వాక్ఇన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం ప్రిన్సిపాల్ జి. రమేశ్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో రూ.100 ధ్రువీకరణ రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం ట్రేడ్, ఐటీఐలకు సంబంధించిన ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు అనంతరం అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 10 గంటలకు హాజరై అటెండీ తీసుకోవాలని, మధ్యాహ్నం 1 గంట నుంచి మెరిట్, ఎంపిక చేసుకున్న ట్రేడ్, ఐటీఐ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. 10వ తరగతి లేదా కొన్ని నిర్దిష్ట ట్రేడ్లకు 8వ తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2022 ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, గరిష్ఠ వయోపరిమితి లేదని పేర్కొన్నారు. ఒకే ఆన్లైన్ దరఖాస్తులో అభ్యర్థులు తమకు నచ్చినన్ని ట్రేడ్లు, ఐటీఐలను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవచ్చని, ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా సీటు పొందే అవకాశాలు మెరుగుపడతాయని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి. రమేశ్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


