పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించాలి.
పసిడి బాల్యం.. ఆటపాటలతో అభ్యసన చేయించాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ :పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ, అభ్యసనాన్ని ఆనందభరితంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 74 ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఆటపాటల ద్వారా విద్యాబోధన అందించేలా వినూత్న అభ్యసన సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా మావల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు, డ్యాన్స్, పాటల కోసం మైక్ సెట్లు, ఊయలలతో పాటు చిన్నారులను ఆకట్టుకునేలా రూపొందించిన అభ్యసన సామగ్రిని పరిశీలించారు. వీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ బోధనను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం చిన్నారులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, పీఎంఓ మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


