హౌస్ అరెస్ట్ అక్రమం
– దళితుల హక్కులను హరించవద్దు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై చేసిన అనుచిత, దుర్భాషల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు హౌస్ అరెస్టుల పేరుతో అడ్డుకోవడం సరికాదన్నారు.బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడతామని డాక్టర్ రామకృష్ణ హెచ్చరించారు.అలాగే తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తాతా మధుపై పార్టీ కఠిన చర్యలు తీసుకున్నప్పుడే దళిత సమాజంలో బీఆర్ఎస్పై నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందని అన్నారు. లేనిపక్షంలో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను హరించే ప్రయత్నాలను సహించబోమని, దళితులు, పేదలు, అణగారిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున నిలబడి పోరాడుతామని డాక్టర్ రామకృష్ణ స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


