అభివృద్ధి పథంలో మాచిన్పల్లి
దౌల్తాబాద్, : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మాచిన్పల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఊపందుకుంది. వివిధ పనులకు నిధులు మంజూరు కావడంతో పలు పనులు పూర్తికాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. బిల్లులు పెండింగ్లో ఉన్నా గ్రామాభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని సర్పంచ్ బొక్కల నాగరాజు తెలిపారు.రూ.19.50 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, రూ.40 లక్షలతో ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. అలాగే రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో 27 ఇళ్లు మంజూరయ్యాయి.
రూ.12 కోట్లతో డ్యామ్ ప్రతిపాదన
సదర్ చెరువు వద్ద రూ.12కోట్ల అంచనా వ్యయంతో డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పరిపాలనా అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సర్పంచ్ తెలిపారు. మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి సహకారంతో గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ బొక్కల నాగరాజు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


