శివాలయ భూములపై వివాదం.. అక్రమ విక్రయాలకు యత్నాలా?
షాబాద్, (రంగారెడ్డి): షాబాద్ మండలంలోని సర్దార్నగర్ గ్రామంలో శివాలయానికి చెందిన భూముల విషయంలో వివాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం, శివాలయానికి సంబంధించిన సర్వే నంబర్లు 428, 429లో సుమారు 14–15 ఎకరాల భూమి గతంలో ఆలయ పూజారుల అధీనంలో ఉండేది.అయితే ప్రస్తుతం ఈ భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవుని పేరుమీద ఉన్న భూమి కొన్ని సంవత్సరాలుగా ఆలయ పూజారుల పేర్లపైకి ఎలా మారిందనే విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భూమి విక్రయానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు ఆరా తీయగా, దేవుని పేరుమీద ప్రస్తుతం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని, మిగిలిన భూమి తమకు సంబంధించినదేనని పూజారులు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు.దేవుని పేరుమీద ఉన్న భూముల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమించేందుకు లేదా విక్రయించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.భూముల రికార్డులు, గతంలో జరిగిన మార్పిడులు, ప్రస్తుతం ఉన్న హక్కులపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


