నేరాల నియంత్రణే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్
రాంపుర్లో పోలీసుల తనిఖీలు.. వాహనదారులకు జరిమానాలు
బెల్లంపల్లి మంచిర్యాల : నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు కాసిపేట మండలం దేవాపూర్ పోలీసులు రాంపుర్ గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ గంగారం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు ట్రాలీలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగారం మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులను ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజ్లు, సోషల్ మీడియా మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112కు ఫోన్ చేయాలని చెప్పారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలతో పాటు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని ఎస్ఐ తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


