ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్
బెల్లంపల్లి మంచిర్యాల : నెన్నెల మండలం నందులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్మిల్కు సంబంధించి రూ.4.36 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. నెన్నెల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం అధికారుల సూచన మేరకు విచారణ స్థలానికి వెళ్లిన బీఆర్ఎస్ నెన్నెల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎండీ ఇబ్రహీం, మండల అధ్యక్షుడు పంజాల సాగర్గౌడ్, నాయకులు పూదరి అంజిగౌడ్, దుర్గం కృష్ణస్వామిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులపై నమోదైన కేసులను పునఃపరిశీలించి, అక్రమంగా నమోదైనట్లు తేలితే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విచారణ సందర్భంగా నాయకులపై దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగంపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిన్నయ్య అన్నారు. లేనిపక్షంలో త్వరలో కార్యాచరణ ప్రకటించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


