తలతిక్కా.. టార్గెట్టా? పోలీసుల వలలో 'షూటర్ ఇర్ఫాన్' పడ్డాడు
కర్ణాటక, తెలంగాణాల్లో మోస్ట్ వాంటెడ్! 41 కేసులున్నా, తప్పించుకుని తిరుగుతున్నాడు.
గండిపేట (రంగారెడ్డి): సైబరాబాద్ పోలీసుల వలలో మరో కీలక నేరస్థుడు దొరికాడు. అంతర్రాష్ట్ర నేరగాడు షేక్ ఇర్ఫాన్ అహ్మద్, అలియాస్ 'షూటర్ ఇర్ఫాన్', పోలీసుల చేతికి చిక్కాడు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డెకాయిటీ కేసులో ఇతనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 6వ తేదీన TGPA రోటరీ సమీపంలో, హిమాయత్ సాగర్ రోడ్డులో కొందరు పాదచారుల ను టార్గెట్ చేసి, వారిని మోటార్ సైకిళ్లపై అపహరించుకుని వెళ్ళారు. బ్రాడ్వే హోటల్ వెనుక ఉన్నా నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి, కత్తులతో బెదిరించి వారి వద్దనున్న నగదు, ఇతర వస్తువులను దోచుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు షేక్ ఇర్ఫాన్ ను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షేక్ ఇర్ఫాన్ అహ్మద్ పరమ మోసగాడు. కేవలం తెలంగాణలోనే కాకుండా కర్ణాటకలో కూడా ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. మొత్తం 41 నేరాల్లో ఇతను నిందితుడుగా ఉన్నాడు. దోపిడీలు, డెకాయిటీలు, హత్యాయత్నం, ఇళ్లల్లో చొరబడి దొంగతనాలు వంటి సీరియస్ క్రైమ్స్ ఇతని ట్రాక్ రికార్డులో ఉన్నాయి. 13 నాన్ బైలబుల్ వారెంట్లు ఇతనిపై జారీ అయ్యాయి. ఇతని నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని, ఇతనిపై 'రికరింగ్ ఆఫెండర్' కింద కఠిన సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఇతనిని కోర్టు ముందు ప్రవేశపెట్టి, రిమాండుకు తరలించారు. ఈ అరెస్టుతో పోలీసులకు పెద్ద ఊరట లభించింది. పోలీసుల సత్వర స్పందనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు పోలీస్ ఒక విజ్ఞప్తి చేస్తోంది. ఏదైనా అనుమానాస్పద స్థితి కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, లేదంటే డయల్ 100 కి కాల్ చేయాలని కోరారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


