ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్..!
రాజన్న సిరిసిల్ల, : బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై 27 కేసులు నమోదు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-2026 విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఐపీఎస్ తెలిపారు. జూలై 1 నుంచి 31 వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, విద్య, జిల్లా బాలల సంరక్షణ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో 104 మంది బాలబాలికలను గుర్తించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపర్చి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారి సంరక్షణకు అప్పగించారు. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై 27 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా బాలలతో పనులు చేయిస్తున్నట్లు లేదా వీధి బాలలు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


