35 వాహనాలు, విలువైన ఆస్తులు స్వాధీనం
- అధిక లాభాల పేరుతో కోట్ల మోసం..
- భారీ ఆర్థిక నేరాన్ని ఛేదించిన కొత్తగూడెం పోలీసులు
కొత్తగూడెం : అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడులు సేకరించి మోసానికి పాల్పడిన కేసును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 35 వాహనాలతో పాటు ఇతర నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన దర్యాప్తులో, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. భార్పాటి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్లో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని, భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర డబ్బులు సేకరించినట్లు గుర్తించారు. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలాలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్పై జిల్లాకు తీసుకొచ్చి విచారించారు. విచారణలో భాగంగా 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను నేరార్జిత ఆస్తులుగా భావించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాధితుల నుంచి సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్నగర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని, మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.అధిక లాభాలు, తక్కువ సమయంలో రెట్టింపు రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
