గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
- నిమజ్జన పాయింట్ల వద్ద బ్యారికేడ్లు, క్రేన్లు, వైద్య శిబిరాలు,
- గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచాలి
- ప్రశాంత వాతావరణానికి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
- అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
పెద్దపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాలుగు పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల వారీగా ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జన రూట్మ్యాప్ను సిద్ధం చేసి, మార్గాల్లో రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిమజ్జన పాయింట్ల వద్ద బ్యారికేడ్లు, క్రేన్లు, విద్యుత్, లైటింగ్, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. క్రేన్లకు అదనపు డ్రైవర్లు, మెకానిక్లను సిద్ధంగా ఉంచి ఉదయం నుంచే పనిచేసేలా చూడాలన్నారు. విగ్రహాల తరలింపు మార్గాల్లో విద్యుత్ తీగలు, కేబుళ్లు, చెట్ల కొమ్మల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి నిమజ్జన పాయింట్లో షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను నియమించాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందితో పాటు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిశుభ్రతను పర్యవేక్షించాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎక్కడా మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా మద్యనిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. నిమజ్జన మార్గాల్లో దుకాణాల వల్ల ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళ విగ్రహాల తరలింపు సమయంలో పశువుల వల్ల ప్రమాదాలు జరగకుండా వాటి సంచారాన్ని నియంత్రించాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని శ్రీరాములు కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి. గంగయ్య, సురేష్, ఏసీపీ జి. కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


