సూర్య ఈఎన్టి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు!
విజన్ ఆంధ్ర కథనానికి స్పందన
- డాక్టర్ పట్టా లేకున్నా వైద్యం..
- రోగుల ప్రాణాలతో చెలగాటం అంటూ విజన్ ఆంధ్ర కథనం
- కలెక్టర్ ఆదేశాలతో చర్యలు..
- ఆకస్మిక తనిఖీ, షోకాజ్ నోటీసు అనంతరం రిజిస్ట్రేషన్ రద్దు
మెట్పల్లి, : మెట్పల్లి పట్టణంలోని సూర్య ఈఎన్టి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డా. ముస్కు జైపాల్ రెడ్డి తెలిపారు. “డాక్టర్ పట్టా లేకున్నా వైద్యం.. రోగుల ప్రాణాలతో చెలగాటం” అనే శీర్షికతో విజన్ ఆంధ్రలో ప్రచురితమైన కథనానికి స్పందనగా అధికారులు చర్యలు చేపట్టారు. సూర్య ఆసుపత్రిలో అర్హత లేని వైద్యుడితో ఈఎన్టి స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారనే నేపథ్యంలో ఈ నెల 2న డా. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు ఆసుపత్రి రికార్డులను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. అయితే యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో గురువారం రాత్రి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డా. జైపాల్ రెడ్డి తెలిపారు. విచారణలో అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలడంతో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో తప్పనిసరిగా నమోదిత, అర్హత కలిగిన వైద్యులతోనే వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే విధంగా నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉప వైద్యాధికారి హెచ్చరించారు. విజన్ ఆంధ్ర కథనానికి స్పందించి అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల స్థానికంగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


