సహజ సాగుతో లాభాలే.. ప్రత్యామ్నాయ పంటలే మేలు
- మాల్కేపల్లిలో రైతులకు అవగాహన..
- వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచన
బెల్లంపల్లి మంచిర్యాల : సహజ వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని పెంచుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. కాసిపేట మండలం మాల్కేపల్లి గ్రామంలో సహజ వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ.. జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం తయారీ, మల్చింగ్, అంతర పంటలు, పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే వనరులను వినియోగించి సహజ వ్యవసాయం చేపడితే సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని వివరించారు. ప్రస్తుత వానాకాలంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగును చేపట్టాలని కోరారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, ముఖ్యంగా యూరియా వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేయాలని సూచించారు. నూతన ఎరువుల బుకింగ్ యాప్ వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీమతి కె. నాగ దీప్తి, రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


