ముసాయిదా ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
- అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు తుది జాబితాలో ఉండేలా చూడాలి
- బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లకు తాటికొండ సీతయ్య సూచనలు
తుంగతుర్తి : ముసాయిదా ఓటర్ల జాబితాను బూత్ స్థాయి ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి, ఓటర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చొరవ చూపాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రభుత్వం ప్రకటించిం దని, గ్రామసభల్లోనూ జాబితా వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నారని తెలిపారు.ముసాయిదా జాబితాలో తుంగతుర్తి మండల పరిధిలో 581 మంది ఓటర్లు మ్యాపింగ్ కానివారిగా గుర్తించబడ్డారని, నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంఖ్య 6,657గా ఉందని సీతయ్య తెలిపారు.ఎన్యూమరేషన్ ఫారంలో గత వివరాలు నమోదు చేయకుండా కింది భాగాన్ని మాత్రమే పూర్తి చేసి సమర్పించిన వారిని మ్యాపింగ్ కాని ఓటర్లుగా పరిగణిస్తున్నారని వివరించారు.ఇలాంటి ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తారని, ఎన్నికల సంఘం నిర్ణయించిన 14 రకాల గుర్తింపు కార్డుల్లో అవసరమైన ఏదో ఒకటి లేదా రెండు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.నోటీసులో పేర్కొన్న తేదీన సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయంలో హాజరై దరఖాస్తుతో పాటు అవసరమైన ఆధారాలను అందజేయాలని సూచించారు.
అనామలీస్ ఓటర్లపైనా ప్రత్యేక దృష్టి
పేర్లలో అచ్చు తప్పులు, వివరాల్లో తేడాలు ఉన్న అనామలీస్ ఓటర్లు తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో 5,987 మంది ఉన్నారని సీతయ్య తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంఖ్య 40 వేలకు పైగా ఉందన్నారు. వీరం దరికీ బూత్ స్థాయి అధికారులు నోటీసులు అందజేస్తారని చెప్పారు.నోటీసులు అందుకున్న ప్రతి ఓటరును బూత్ స్థాయి ఏజెంట్లు వ్యక్తిగతంగా సంప్రదించి, అవసరమైన ఆధారాలను బూత్ స్థాయి అధికారులకు, పర్యవేక్షకులకు అందించేలా చూడాలని సూచించారు.ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను సరిచేసి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు తుది ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా బూత్ స్థాయి ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లదే కీలక బాధ్యత ముసాయిదా జాబితా నుంచి తుది ఓటర్ల జాబితా వరకు జరిగే ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్ల బాధ్యత ఎంతో కీలకమని సీతయ్య పేర్కొన్నారు. తమ పరిధిలోని ప్రతి ఓటరును సంప్రదించి, జాబితాలో వారి పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు.తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో బూత్ స్థాయి ఏజెంట్లకు ముసాయిదా ఓటర్ల జాబితాలను అందజేసి సీతయ్య ఈ సూచనలు చేశారు. అనంతరం మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, నాయకు లు గుగులోతు రాములు నాయక్, గుగులోతు పులాని నాయక్, హేమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


