వణుకుతున్న తెలంగాణ..!!
డిసెంబర్ 31 వరకు చలి పంజా (కోల్డ్వేవ్)..!

కనిష్ఠంగా 3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం : అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక...
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఆరు రోజులపాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డిసెంబర్ 31 వరకు సాధారణ శీతాకాలం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, జనవరి 2 నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.

మళ్లీ సంక్రాంతి నాటికి చలి తీవ్రత పెరిగే అవకాశం..
ఇటీవల పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పలుచోట్ల 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదు కావడంతో ప్రజానీకం వణికిపోతున్నారు. జనవరి ప్రారంభంలో వాతావరణం.. సాధారణ శీతాకాలం మాదిరిగానే ఉంటుందని, మళ్లీ సంక్రాంతి నాటికి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పొగమంచు ప్రభావం..
రాత్రి మరియు తెల్లవారుజాము సమయాల్లో దట్టమైన పొగమంచు (Dense Fog) కురిసే అవకాశం ఉంది. దీనివల్ల రహదారులపై దృశ్యమానత (Visibility) తగ్గి, వాహనదారులకు ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వృద్ధులు, చిన్నపిల్లలు తెల్లవారుజామున బయటకు రాకపోవడం ఉత్తమం. శీతల గాలుల నుండి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు (స్వెట్టర్లు, రగ్గులు) తీసుకోవాలి. పొగమంచు కారణంగా వాహనదారులు ఫాగ్ లైట్లు వాడటం లేదా తక్కువ వేగంతో ప్రయాణించడం క్షేమకరం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


