ఏజెన్సీ ప్రాంతానికి ఆరోగ్య వరం
చర్లలో రూ.10.70 కోట్లతో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.10.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు (TGMSIDC) ద్వారా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించి, ప్రభుత్వం తరపున ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల నిరుపేద రోగులకు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయబడిందని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ భవనం పూర్తయితే గిరిజనులు మరియు స్థానిక ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఓ రవి బాబు, స్థానిక సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


