ఖర్గేపై దాడి కాదు.... రాజ్యాంగంపై దాడి.

ఖర్గేపై దాడి కాదు.... రాజ్యాంగంపై దాడి.

  •  బిజెపి కుల, మత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం.
  • కాంగ్రెస్ కమిటీ జిల్లా అధికార ప్రతినిధి కే. గోపాల్.

తాండూరు (వికారాబాద్ ): ఇది ఖర్గేకు జరిగిన అవమానం (దాడి) కాదని, రాజ్యాంగ స్ఫూర్తి పైన జరిగిన దాడి(అవమానం) అని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది కే .గోపాల్ ఒక ప్రకటనలో అన్నారు. గత శనివారం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఉన్న రాష్ట్రీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ 'విజయ్ శంఖనాద్' ర్యాలీని నిర్వహించింది. ఈ సభకు ఖర్గే హాజరై ప్రసంగించారు. ఈ సభ జరిగిన రెండు రోజుల తర్వాత (ఆగస్టు 10న) 'శ్రీరామ్ సేన' అనే సంస్థ ఆ మైదానంలో శుద్ధీకరణ' పేరుతో హవనం (హోమం) నిర్వహించిన విషయం విధితమే. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన ఒక వ్యక్తిని అవమానించడమే కాకుండా, భారత రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి విలువలను అవమానించే చర్యగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ అంశంపై ఆదివారం న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ.... రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన గౌరవం, హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు పాల్గొన్న సభా వేదికను 'శుద్ధి' చేయడం వంటి చర్యలు సమాజంలో కుల వివక్షకు సంబంధించిన భావజాలాన్ని ప్రతి బింబిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాకుండా, ఆయన రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో గౌరవించాలని గోపాల్ అన్నారు. అంబేద్కర్ను మాటల్లో ప్రశంసిస్తూ, రాజ్యాంగం కల్పించిన సమానత్వ విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం బిజెపి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం మతం, కులం పేరుతో రాజకీయ విభజనలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నిరుద్యోగం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల వంటి ప్రజల అసలు సమస్యలు పక్కకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. ప్రజల మధ్య విభజనలకు బదులు సామాజిక సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. భారతదేశం మనుస్మృతి ఆధారంగా కాకుండా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగా నడుస్తుందని గోపాల్ పేర్కొన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని కాపాడటం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని, కుల వివక్షకు తావిచ్చే ఎలాంటి చర్యనైనా ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. చివరగా "జై భీమ్ -- జై కాంగ్రెస్ -- జై హింద్" అంటూ ఆయన పిలుపునిచ్చారు.
 
 
 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News