యూరియా బస్తాపై రూ.33 రవాణా భారం!
దౌల్తాబాద్ పీఏసీఎస్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు?
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నట్లు రసీదు ఆధారంగా తెలుస్తోంది. ఆరు బస్తాలకు రూ.198 రవాణా రుసుముగా వసూలు చేసినట్లు రసీదులో నమోదు కావడం గమనార్హం.రూ.267 చొప్పున ఆరు బస్తాల యూరియాకు రూ.1,602 కాగా, రవాణా పేరుతో మరో రూ.198 కలిపి మొత్తం రూ.1,800 వసూలు చేశారు. బస్తాకు రూ.33 రవాణా రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి ఉందా? అన్నదానిపై రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అధికారులు చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ పీఏసీఎస్లో రవాణా పేరుతో వసూలు చేస్తున్న రూ.33కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు, నిబంధనలను అధికారులు వెల్లడించాలని రైతులు కోరుతున్నారు. అనుమతి లేకుండా వసూళ్లు జరుగుతున్నట్లయితే వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంత మొత్తం వసూలు చేశారు? ఎక్కడ జమ చేశారు? అనే అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


