పెన్పహాడ్లో గుప్తనిధుల తవ్వకాల కలకలం
- 15 మంది అనుమానితుల గుర్తింపు?
- రాజ్పేట శివారులోని పురాతన కట్టడం వద్ద అర్ధరాత్రి ఘటన
- రైతుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..
- విచారణ ముమ్మరంఇతర ప్రాంతాల వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు స్థానికుల కథనం
పెన్పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేగింది. మండలంలోని అనాజిపురం రెవిన్యూ గ్రామం రాజ్పేట శివారులో గల నిజాం కాలం నాటి పురాతన మసీదు పరిసర ప్రాంతంలో రహస్యంగా తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలపై సుమారు 15 మందిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు పురాతన కట్టడం పరిసరాల్లో బుధవారం అర్ధరాత్రి వేళ కొంతమంది వ్యక్తుల కదలికలు అనుమానాస్పదం గా కనిపించాయి. గమనించిన స్థానిక రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్న సుమారు 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతర్రాష్ట్ర లింకులపై ప్రచారం పట్టుబడిన వారిలో ఇదే మండలానికి చెందిన దోసపహాడ్, అనాజిపురం గ్రామాల వ్యక్తులు, అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిధుల వేట కోణంలోనే వీరంతా ఇక్కడకు వచ్చారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుల పూర్తి వివరాలు, కేసు గురించిన అధికారిక సమాచారం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


