యూరియా కోసం చెప్పులతో క్యూ లైన్
- సర్వర్ సమస్యతో రెండు గంటలుగా రైతుల నిరీక్షణ.. ఎండతీవ్రతతోతిప్పలు
- 1100బస్తాలుఅందుబాటులో ఉన్నా పంపిణీకి సాంకేతిక ఆటంకం
సంగారెడ్డి డెస్క్ / మెదక్ జిల్లా పాపన్నపేట: యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. మండలకేంద్రమైనపాపన్నపేట సొసైటీలో యూరియా నిల్వలు అందుబాటులోకి రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే సర్వర్ సమస్య తలెత్తడంతో సుమారు రెండు గంటల పాటు పంపిణీకి అంతరాయం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో తెలియక నిరీక్షించిన పలువురు రైతులు ఎండలో నిలబడలేక తమ చెప్పులను క్యూలో పెట్టి వంతు స్థానాలను కాపాడుకున్న దృశ్యం అక్కడ కనిపించింది. సొసైటీలో సుమారు 1100 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా పంపిణీలో జాప్యం ఏర్పడింది. దీంతో యూరియా కోసం వచ్చిన రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. యూరియా ఉంది.. కానీ సర్వర్ సహకరించలేదు! అన్నట్లుగా పరిస్థితి మారింది.ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాజును వివరణ కోరగా సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. సమస్యను పరిష్కరించి యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.యూరియా కోసం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తమకు సర్వర్ సమస్యలు మరింత భారంగామారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


