శివంపేటలో ఎస్ఐఆర్ ఓటర్ల పరిశీలన
2311 మంది ఓటర్లకు 807 అభ్యంతరాలు.. ఆధారాలతో నోటీసుల పరిశీలన
చౌటకూర్, : చౌటకూర్ మండలం పరిధిలోని శివంపేట గ్రామపంచాయతీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామపంచాయతీ పరిధిలోని మూడు పోలింగ్ స్టేషన్లలో కలిపి మొత్తం 2,311 మంది ఓటర్లు ఉండగా, 807 అభ్యంతరాలు (ఆబ్జెక్షన్లు) నమోదైనట్లు అధికారులు తెలిపారు.గురువారం పోలింగ్ స్టేషన్ నంబర్ 273లో నమోదైన 218 అభ్యంతరాలకు సంబంధించి ఓటర్ల వివరాల పరిశీలన చేపట్టారు. ఇప్పటివరకు 180 మంది ఓటర్లకు సంబంధించిన నోటీసులను సంబంధిత ఆధారాలతో పరిశీలించిన ఎంపీడీవో, ఏఈఆర్ఓ కే. శంకర్ ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసిన నోటీసులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సంబంధిత పత్రాలు మరియు ఆధారాలను సేకరిస్తున్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదు చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.శివంపేట గ్రామపంచాయతీలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 274, 275లో ఎస్ఐఆర్ కార్యక్రమం సెప్టెంబర్ 18, 19 తేదీల్లో కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సంబంధిత ఓటర్లు తమకు సంబంధించిన పత్రాలు, ఆధారాలతో హాజరై పరిశీలన ప్రక్రియకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్, ఆర్ఐ ప్రమోద్ కుమార్, బీఎల్ఓలు అనూష, షాహిద్, సుల్తానా, మల్లేశం, సర్పంచ్ కొత్తగాడి సంధ్యారాణి మల్లికార్జున్, ధనరాజ్, గ్రామ పెద్దలు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సహకరించారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


