పీఆర్సీ నివేదిక రేపు సీఎస్ చేతికి..!
18న ఉపాధ్యాయ సంఘాలతో కీలక సమావేశం
అక్కన్నపేట, : పీఆర్సీ, డీఏలు, ఉద్యోగులు–ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రేపు పీఆర్సీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించే అవకాశం ఉన్నట్లు రిటైర్డ్ ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాలతో 18న కీలక సమావేశం
ఈ నెల 18న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పీఆర్సీ, డీఏలు, ఇతర ప్రధాన డిమాండ్లపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి సుమారు 25 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మూడు డీఏలపైనే ప్రధాన దృష్టి
ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో పీఆర్సీ అమలు అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కనీసం పెండింగ్లో ఉన్న మూడు డీఏలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలపై ఉద్యోగ సంఘాల్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
సంఘాల నేతలతో చర్చలు
ఈ అంశాలపై ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ తదితర సంఘాల నాయకులను కలసి పీఆర్సీ, డీఏలు,ఇతర ఉద్యోగ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇంటర్స్టేట్ బదిలీల అంశాన్ని కూడా టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అప్రమత్తంగా పరిస్థితులను గమనిస్తున్నాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


