హక్కుల సాధన కోసం ఉద్యోగుల మహా ధర్నా
జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన టీఎన్జీవోలు, ఉద్యోగులు
పెద్దపల్లి, : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం మహా ధర్నా నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, కన్వీనర్ తూము రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని పెంచాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఆరోగ్య భద్రత కార్డులు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలోనూ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా మని హామీలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలే దని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి త్వరలోనే న్యాయం చేస్తారనే ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి శుభవార్త అందించాలని వారు కోరారు.


About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


