ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు, పప్పు ధాన్యాలు, బియ్యపు గింజలు వంటి పర్యావరణహిత వస్తువులతో మహిళా ఉపాధ్యాయులు వై. మంజులత, అమీనా, నూర్జహాన్ బేగం విద్యార్థినులతో కలిసి అందమైన రాఖీలను తయారుచేశారు. అనంతరం ఆ రాఖీలను ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయుడు సభావత్ వెంకట్ కుమార్తో పాటు పాఠశాల విద్యార్థులకు కట్టి రాఖీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటికి కూడా రాఖీలు కట్టి ప్రకృతిని మన కుటుంబ సభ్యుడిగా భావించి సంరక్షించాలనే సందేశాన్ని అందించారు .ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాతావరణ మార్పులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. "మనుషులు ప్రకృతిని రక్షిస్తే, ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రకృతి మనల్ని రక్షిస్తుంది" అని పేర్కొన్నారు.అంతేకాకుండా, ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు తయారుచేసిన రాఖీలలోని ఆకులు, రంగురంగుల రాఖీలను లెక్కించే కార్యక్రమాల ద్వారా గణిత అభ్యసన ఫలితాలను సరదాగా సాధింపజేశారు. దీంతో రాఖీ పండుగను పర్యావరణ పరిరక్షణతో పాటు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అభ్యాసంతో అనుసంధానించి నిర్వహించడం విశేషంగా నిలిచింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


