భట్టి ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్లలో నడుస్తుంది.
- అరాచకాలు ఆపకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం: లింగాల కమల్ రాజు
- పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తే,చిక్కులు తప్పవు
- అధికారులకు, పోలీసులకు ప్రజల తరఫున రెఫరెండం ఇచ్చిన మాజీ జడ్పి చైర్మన్,బీఆర్ఎస్ మధిర నియోజవర్గ ఇంచార్జ్
బోనకల్ : బోనకల్ మండలంలో కొనసాగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, మట్టి అక్రమ రవాణా వంటి వ్యవహారాలను వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు హెచ్చరించారు. బోనకల్ మండల ముఖ్య నాయకులతో గురువారం జానికిపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బోనకల్ మండలంలో భట్టి విక్రమార్క ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్ల రూపాయల వ్యవహారంగా మారిందని కమల్ రాజు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల సంపదను కొంతమంది అక్రమార్కులు దోచుకుంటుంటే అధికార యంత్రాంగం,పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం సరికాదన్నారు.“మట్టి మాఫియాను వెంటనే అరికట్టాలి. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అండదండలతో అక్రమాలు కొనసాగితే ప్రజలను సమీకరించి కలిసొచ్చే పార్టీలతో పోరాటం తప్పదు” అని కమల్ రాజు స్పష్టం చేశారు.పోలీసులు..అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కమల్ రాజు హెచ్చరించారు. పోలీసుల విధి ప్రజలందరికీ సమానంగా న్యాయం చేయడం, చట్టాన్ని కాపాడటమే తప్ప ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కాదన్నారు“పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. అధికారంలో ఉన్న పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అనే విధానం కొనసాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు” అని ఆయన అన్నారు.ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోందని కమల్ రాజు ఆరోపించారు. ప్రజలు తమ ఓటుతో ఎవరిని ఎన్నుకున్నారో ఆ ప్రజా తీర్పునుగౌరవించకుండా అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.స్థానిక సంస్థల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, ఎన్నికైన సర్పంచులు స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేసే వాతావరణాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కమల్ రాజు విమర్శించారు. భట్టి విక్రమార్క గుడిలో బాండ్ పేపర్ రాసి ఇచ్చిన హామీలను ప్రజలు ఇంకా మరిచిపోలేద న్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం పెరుగుతోందని కమల్ రాజు అన్నారు. “కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుతో పోల్చుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.“ఇది అధికారులకు, పోలీసులకు మేమిస్తున్న రెఫరెండం. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తారా? లేక అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతారా? అనేది తేల్చుకోవాలి. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలతో కలిసి ఉద్యమ బాట పడతాయి” అని కమల్ రాజు హెచ్చరించారు.బోనకల్ మండలంలో అక్రమాలు, మట్టి దందా, రాజకీయ వేధింపులు, దౌర్జన్యాలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలను, పోరాటాలను ఉధృతం చేస్తామని లింగాల కమల్ రాజు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


