ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించాలి:వనపర్తి జిల్లా కలెక్టర్
వనపర్తి /: బుగ్గపల్లిలోని 75 ఎంఎల్డీ మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. క్షేత్రస్థాయిలోనూ నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలనీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పెద్దమందడి మండలం బుగ్గపల్లి వద్ద ఉన్న 75 ఎంఎల్డీ సామర్థ్యం గల మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సందర్శించి పరిశీలించారు. ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కను నాటారు. అనంతరం మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట రమణతో కలిసి నీటి శుద్ధి ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించారు.ప్లాంట్లో నీటి ప్రవాహం, ఫిల్టరేషన్ ప్రక్రియకు సంబంధించిన ఫ్లో డయాగ్రామ్ను కలెక్టర్ పరిశీలించారు. గౌరిదేవిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు ప్లాంట్కు ఏ విధంగా చేరుతుంది, ప్లాంట్కు చేరిన అనంతరం వివిధ దశల్లో నీటిని ఏ విధంగా శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లోని నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాలను కలెక్టర్ సందర్శించారు. నీటి వడపోత (ఫిల్ట్రేషన్) ప్రక్రియ, నీటి నాణ్యతను పరీక్షించే విధానం, శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిర్ధారించే పరీక్షలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్లాంట్ నుంచి ప్రజలకు సరఫరా చేసే సమయంలో ఉన్న నీటి నాణ్యత క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే వరకు అదే స్థాయిలో కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు క్షేత్రస్థాయిలో కూడా నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ అంజద్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక సర్పంచ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
