గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించండి
యువతకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచన
నాగర్ కర్నూల్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత జిల్లా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచించారు.బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ చదువుకుంటున్న నిరుద్యోగ యువతీ, యువకులతో మాట్లాడి వారి చదువు ప్రణాళిక, రోజువారీ అధ్యయన సమయం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.పోటీ పరీక్షలకు అవసరమైన జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, చరిత్ర, భూగోళశాస్త్రం, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, విజ్ఞానశాస్త్ర పుస్తకాలతో పాటు తాజా సమాచార పుస్తకాలను చదవాలని చెప్పారు.సమకాలీన అంశాలపై పట్టు కోసం ప్రతిరోజూ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ దినపత్రికలు చదవాలని సూచించారు. డిజిటల్ గ్రంథాలయ సేవలు, ఆన్లైన్ అధ్యయన వనరులను కూడా వాడుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాతో సమయం వృథా చేయకుండా సాంకేతికతను లక్ష్య సాధనకు ఉపయోగించుకోవాలని హితవు పలికారు.నిర్దిష్ట ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని సిలబస్, పరీక్ష విధానం,గత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా చదవాలన్నారు.క్రమశిక్షణతో నిరంతర సాధన, మాక్టెస్టులు, పునశ్చరణ ద్వారా తప్పకుండా విజయం సాధించవచ్చని ధైర్యం చెప్పారు.జిల్లా గ్రంథాలయంలో చరిత్రకు సంబంధించిన 18,108 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిలో తెలుగు 9,768, ఇంగ్లిష్ 3,632, హిందీ 2,874, ఉర్దూ 1,726 పుస్తకాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు అవసరమైన తాజా సమాచారంతో 2,907 పుస్తకాలు ఉన్నాయి.యువతకు అవసరమైన పుస్తకాలు, సమాచార వనరులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి యువతలో అపారమైన ప్రతిభ ఉందని, దానిని సరైన దిశలో మళ్లించుకుంటే లక్ష్యం తప్పకుండా చేరుకుంటారని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


