అర్బన్ పార్కుల కంటే ప్రజా సమస్యలే ముఖ్యం..కార్మిక సంఘాల ఐక్యవేదిక
బెల్లంపల్లి మంచిర్యాల :అర్బన్ పార్కుల నిర్మాణం కంటే ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం, అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో అధ్వానంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసరమైన సమస్యలను పక్కనపెట్టి పార్కుల నిర్మాణానికి నిధులు వెచ్చించడం సరైన నిర్ణయం కాదన్నారు. సింగరేణి కార్మికుల కృషితో అభివృద్ధి చెందిన బెల్లంపల్లి ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.ముందుగా ప్రజల సమస్యలు పరిష్కరించండి.ఆ తర్వాత పార్కుల గురించి ఆలోచించండి అని స్పష్టం చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి టి. మణిరామ్ సింగ్, ఎస్ జి కె ఎస్ రాష్ట్ర నాయకులు అంబాల మహేందర్, ఏఐఎఫ్ టు యు రాష్ట్ర కార్యదర్శి ఎం. పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


