సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి:డీఎంహెచ్ఓ ధనరాజ్
దౌల్తాబాద్(సిద్దిపేట):దౌల్తాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని తండాలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదవడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ ధనరాజ్ గురువారం తండాను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.డెంగ్యూ బారిన పడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే బాధితుడి నివాస పరిసరాల్లో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి, నిల్వ నీరు ఎక్కడా లేకుండా చూడాలని స్థానికులకు సూచించారు. గ్రామంలో దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ ధనరాజ్ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కూలర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, నీటి డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా వారానికి ఒకసారి శుభ్రపరచాలని తెలిపారు.అనంతరం వైద్య సిబ్బంది తండాలో ఇంటింటి సర్వే నిర్వహించి, జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించారు. అవసరమైన చోట్ల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. అలాగే తండా పరిసరాల్లో యాంటీ లార్వా ఆయిల్ పిచికారీ చేయడంతో పాటు, ఫాగింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.ప్రజలు జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని డీడీఎంహెచ్ఓ సూచించారు. వైద్యుల సలహా లేకుండా మందులు వాడవద్దని, స్వీయ వైద్యం ప్రమాదకరమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముచ్చమర్రి అనురాధ రమేష్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


