ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేత.
పుల్కల్లో రోడ్డెక్కిన రైతన్నలు
చౌటకూర్,/ సంగారెడ్డి : పుల్కల్ మండలంలోని పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్ గ్రామాల పరిధిలో ఏటిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్లకు ఎలాంటి ముందస్తు నోటీసు లేదా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు.విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిపివేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పూర్తిగా నీటిపారుదలపై ఆధారపడి ఉన్న ఈ సమయంలో విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ధర్నా విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ వంశీకృష్ణ, స్థానిక సీఐ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకునే ముందు తప్పనిసరిగా ముందస్తు సమాచారం ఇవ్వాలని, వ్యవసాయానికి ఆటంకం కలగకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పుల్కల్, మిన్పూర్, కోడూరు, గోంగ్లూర్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


