గొంగ్లూర్ గ్రామ రైతుల ఆవేదన.

ఖరీఫ్ పంట పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయొద్దని వినతి

గొంగ్లూర్ గ్రామ రైతుల ఆవేదన.

చౌటకూర్ / సంగారెడ్డి :  పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూర్ గ్రామ రైతులు తమ సమస్యలను వివరిస్తూ జిల్లా కలెక్టర్‌తో పాటు తహసీల్దార్, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులకు సోమవారం వినతిపత్రాలు అందజేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, మంజీరా పరివాహక ప్రాంతంలోని బ్యాక్‌వాటర్ నుంచి గత 23 సంవత్సరాలుగా మోటార్లు, పైప్‌లైన్‌ల ద్వారా నీటిని తీసుకుని వరి సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఖరీఫ్-2026 సీజన్‌లో వరి నారు వేసి, ఎకరాకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చు చేసి నాట్లు పూర్తి చేశామని తెలిపారు. అయితే ప్రస్తుతం బ్యాక్‌వాటర్ నుంచి మోటార్లు తొలగించి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని , విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జూన్ నెల మొదటి వారాల్లోనే తెలియజేసి ఉంటే తాము ఇంత భారీ పెట్టుబడి పెట్టి సాగు చేపట్టేవాళ్లం కాదని పేర్కొన్నారు.ప్రస్తుతం పంట పెరుగుదల దశలో ఉండగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే తీవ్ర నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా కుంగిపోతారని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాను కొనసాగించాలని, వచ్చే రబీ సీజన్‌లో బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి పంటలు సాగు చేయబోమని అధికారులకు హామీ ఇచ్చారు.ఖరీఫ్ పంట పూర్తయ్యేలోపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి ఖరీఫ్ పంట పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాను కొనసాగించాలని రైతులు అధికారులను కోరారు.
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News