ఆర్థిక వివాదాలు, ఎమ్మెల్యే ఇంట్లో మంటలు

బీఆర్ఎస్ నేత పట్లోళ్ల రూపారెడ్డి అరెస్ట్

ఆర్థిక వివాదాలు, ఎమ్మెల్యే ఇంట్లో మంటలు

గండిపేట (రంగారెడ్డి): చేబదుళ్లు తీసుకుని మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మణికొండ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పట్లోళ్ల రూపారెడ్డిని నార్సింగి పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్థిక వ్యవహారాలు, కుల దూషణల ఆరోపణలతో మొదలైన ఈ వివాదం, అధికారిక ప్రొటోకాల్స్ దాటి స్థానిక ఎమ్మెల్యే ఇంట్లోని కుటుంబ కలహాల వరకు వెళ్లి రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
పోలీస్ స్టేషన్ వద్ద దళితుల ధర్నా
డబ్బుల లావాదేవీల విషయంలో రూపారెడ్డి తమను కులం పేరుతో దూషించారంటూ గురువారం ఉదయం పలువురు బాధితులు, దళిత సంఘాల నాయకులు నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తక్షణమే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన నార్సింగి ఇన్‌స్పెక్టర్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు రూపారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు.
ప్రేమ, నిశ్చితార్థం.. బయటపడ్డ కుటుంబ వివాదం
మరోవైపు ఈ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వెల్లడించిన విషయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రూపారెడ్డి కుమార్తె శ్రేయస్‌ను తాను ప్రేమిస్తున్నానని, గతేడాది (గత నెల 8న) తమ మధ్య నిశ్చితార్థం కూడా జరిగిందని సంతోష్ గౌడ్ విలేకరులకు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రి ప్రకాశ్ గౌడ్‌కు ముందే చెప్పినప్పటికీ, ఆయన తమ వివాహానికి అంగీకరించలేదని ఆరోపించారు.
దాడి ఆరోపణలు.. పోలీసుల తీరుపై మండిపాటు
మణికొండలోని రూపారెడ్డి నివాసంలోనే ఉంటున్న తమపై బుధవారం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మనుషులు 30 నుండి 40 మంది దాడికి పాల్పడ్డారని సంతోష్ గౌడ్ ఆరోపించారు. తనతో పాటు కాబోయే భార్య శ్రేయస్, అత్త రూపారెడ్డి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దాడి జరుగుతుండగా 100కు కాల్ చేసినా నార్సింగి పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఇరికించే కుట్ర: రూపారెడ్డి:
అరెస్ట్‌కు ముందు రూపారెడ్డి మాట్లాడుతూ.. "నేను కొందరికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్న మాట వాస్తవమే, కానీ దానికి 6 నెలల సమయం తీసుకున్నాను. దానికి వారు కూడా సమ్మతించారు. అయితే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నాపై కావాలనే కుట్ర పూరితంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తూ నా ఇంటిపై దాడులు చేయిస్తున్నారు" అని విమర్శించారు. ఒకే వైపు ఆర్థిక లావాదేవీలు, మరోవైపు ఎమ్మెల్యే సొంత ఇంట్లోని వివాదాల నడుమ ఈ కేసు హైడ్రామాగా మారింది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపడతారో లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది.
 
Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News