మర్రిగూడలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టు
- ప్రజాస్వామ్య హక్కులపై ఉక్కుపాదమని మండిపాటు
- పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి
- బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్
నల్గొండ/మర్రిగూడ: బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంతో పాటు రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారనే ఆరోపణలు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.రాష్ట్రంలో విద్యార్థులకు నిలిచిపోయిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మర్రిగూడ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న మర్రిగూడ పోలీసులు మంగళవారం ఉదయాన్నే రంగంలోకి దిగి, నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీ మండల ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టు అయిన వారిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్, ముఖ్య నాయకులు వెనేపల్లి శ్రీనివాసరావు, అంబల్ల రమేష్ గౌడ్, పగడాల నాగేష్, జింకల లింగస్వామి, మామిడి కమలాకర్ ఉన్నారు. వీరందరినీ పోలీసులు మర్రిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రజాస్వామ్యకాలరాస్తున్నారు:పందుల రాములు గౌడ్
పోలీసుల అరెస్టులపై బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్ ఇతర నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగబడటం సిగ్గుచేటని, ఇటువంటి రాజకీయ అరెస్టులతో తమ ఆందోళనలను ఆపలేరని స్పష్టం చేశారు. వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.ముందస్తు అరెస్టులతో మర్రిగూడ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


