ఎంపీడీఓ కార్యాలయమా?... కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?...
ములుగు, మంగపేట : మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు కుడుముల లక్ష్మీనారాయణ ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం. ఇది ప్రజలందరికీ సమానంగా సేవలు అందించే స్థలం. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకలాపాలకు వేదికగా మారడం సమంజసం కాదు. ప్రజా సమస్యలపై ఏ పార్టీ నాయకులైనా లేదా ప్రజాప్రతినిధులైనా ఎంపీడీఓను నేరుగా కలిసి వినతిపత్రాలు ఇవ్వడం, సమస్యలను వివరించడం సహజమైన ప్రక్రియ. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఒకే రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించడం ప్రభుత్వ వ్యవస్థ తటస్థతపై సందేహాలు కలిగిస్తోంది. మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజల ప్రతినిధులను ఆహ్వానించి పారదర్శకంగా సమావేశం నిర్వహించాలి. ప్రభుత్వ కార్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికార యంత్రాంగం ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ సమావేశాలకు అనుమతించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో అనవసర వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఎంపీడీఓ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా ఉండాలి గానీ, రాజకీయ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రంగా మారకూడదు. ప్రభుత్వ అధికారులు అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దూరం పాటిస్తూ, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించాలి. అదే ప్రజాస్వామ్య విలువలకు అనుగుణమైన విధానం. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలను రాజకీయ పార్టీ సమావేశాలకు వేదికగా ఉపయోగించకుండా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


