జిపిఓపై దాడిని ఖండించిన గ్రామ పాలన అధికారుల సంఘం
చౌటకూర్ : వడ్డేపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న బీఎల్ఓ సూపర్వైజర్ (జిపిఓ) సంబరబోయిన సత్యనారాయణపై జరిగిన దాడిని గ్రామ పాలన అధికారుల సంఘం (జీపీఓ అసోసియేషన్) చౌటకూర్ మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చౌటకూర్ మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.సంఘం తెలిపిన వివరాల ప్రకారం, జూలై 15న సాయంత్రం వడ్డేపల్లి గ్రామంలో ఈఎఫ్ ఫారాల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సమయంలో ముక్కగళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడికి వచ్చి దురుసుగా ప్రవర్తించి, విధుల్లో ఉన్న బీఎల్ఓ సూపర్వైజర్ సంబరబోయిన సత్యనారాయణపై చేయి చేసుకుని, ముఖంపై దాడి చేసి పిడిగుద్దులతో కొట్టినట్లు ఆరోపించారు.విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం అత్యంత ఖండనీయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఉద్యోగుల భద్రతను కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారుల సంఘం మండల అధ్యక్షుడు సమీర్, జిల్లా అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణ, ఈశ్వర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


