అశ్వాపురం ఘటనపై జనసేన పార్టీ తీవ్ర ఆందోళన
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళలతో అధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, మాజీ ఆరోగ్య సంచాలకులు డా. గడలశ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివాసీ మహిళల గౌరవం, భద్రత, రాజ్యాంగబద్ధ హక్కులు, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా ఈ ఘటన కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళ గౌరవప్రదమైన జీవితం గడపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ముఖ్యంగా ఆదివాసీ మహిళల పట్ల అధికార యంత్రాంగం మరింత సున్నితంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణలో అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల గౌరవాన్ని, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రాథమిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే భయాందోళనలకు కారణం కాకూడదన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ మహిళల గౌరవాన్ని కాపాడటం అంటే సమాజ గౌరవాన్ని కాపాడటమేనని, వారిపై ఎలాంటి అవమానం, అన్యాయం లేదా దౌర్జన్యాన్ని నాగరిక సమాజం సహించదని స్పష్టం చేశారు. మహిళల గౌరవం, భద్రత, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన పార్టీ ఎప్పటికీ రాజీపడదని, న్యాయం, మానవత్వం, సమానత్వం అనే విలువలకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించడంతో పాటు తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. "ఆదివాసీ మహిళ గౌరవం కేవలం ఒక వ్యక్తి గౌరవం కాదు... అది మన రాజ్యాంగం, మన సమాజం, మన మానవత్వానికి ప్రతిబింబం." అని అన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
