నిరుద్యోగాన్ని రూపుమాపటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్..

శంకరపట్నం : నిరుద్యోగాన్ని రూపుమాపటంలో చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సహయ కార్యదర్శి యుగంధర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో యుగంధర్ మాట్లాడారు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాలన్న చొరవ పాలకుల నుండి కనిపించడం లేదన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు వేగవంతం చేయాలని, ఖాళీలను నిబంధనలతో నింపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. నిరుద్యోగ యువతకు నిరంతరం ధైర్యం ఇచ్చేవిధంగా ప్రభుత్వ రంగం ముందుకు రావాలని,. ప్రైవేట్ రంగానికి నిబంధనలు విధించాలని, ఉద్యోగుల తొలగింపుల విషయంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలన్నారు.. కర్మాగారాలు, సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలి. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఆర్థిక మద్దతు లేదా స్వయం ఉపాధి యోజనాల ద్వారా భరోసా కల్పించాలన్నారు. నవతరానికి సామాజిక భద్రత, పెన్షన్, ఆరోగ్యబీమా, విద్యా సహాయం వంటి రంగాల్లో యువతకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని అన్నారు. ఈ మార్గాల్లో చర్యలు తీసుకోకపోతే రేపటి సమాజం ఘోరసంక్షోభాన్ని ఎదుర్కొవలసి వస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గడిచిన 12ఏండ్ల కాలంలో బడా కార్పొరేట్ లకు 15లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అక్రమంగా దోచి పెట్టిన నీచ చరిత్రను మూటగట్టుకున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో బడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం కు 37శాతం పన్ను కడితే, ఈ బీజేపీ హయాంలో దానిని 16శాతానికి తగ్గించారని, దీని కారణంగా దేశ సంపదకు 9లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.బడా కుబేరులకు యథేచ్ఛగా రాయితీలు ప్రకటించి, సామాన్యుల జీవన పరిస్థితులను దేశ వ్యాప్తంగా దుర్భర స్థితికి మార్చిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని వారు దుయ్యబట్టారు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇప్పటికీ సంపూర్ణ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం తీవ్ర అన్యాయం అని, ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటి భర్తీకి సంబంధించి స్పష్టమైన కాలపట్టిక ఇవ్వకపోవడం వల్ల యువతలో అయోమయం,ఆందోళన పెరుగుతోందని,ఇది కేవలం పరిపాలనా వైఫల్యం అని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని,రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


