జుక్కల్లో అధ్వాన రోడ్లు.. నిమజ్జనానికి ఆటంకం
- గుంతలమయమైన రోడ్లు, ధ్వంసమైన కల్వర్టులతో వాహనదారుల ఇబ్బందులు
- గణేష్ నిమజ్జన వాహనాలకు ప్రమాదం పొంచి ఉందంటున్న స్థానికులు..
- వెంటనే మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి
జుక్కల్, జుక్కల్ మండల కేంద్రంలోని రోడ్లు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. పలు ప్రాంతాల్లో కల్వర్టులు ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారి పగుళ్లతో ప్రమాదకరంగా మారింది. ఛత్రపతి శివాజీ చౌక్, హనుమాన్ మందిరం ముందు సహా పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ విగ్రహాలతో వెళ్లే వాహనాలు గుంతల్లో ఇరుక్కోవడం లేదా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రారంభమయ్యేలోపు సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రహదారిలోని గుంతలను పూడ్చి, ధ్వంసమైన కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులను సురక్షితంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


