గురువారం గ్రామ, వార్డు సభలు
- ఓటరు జాబితా పరిశీలనకు ఇదే మంచి అవకాశం
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ పిలుపు
మల్యాల, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ భవనాల్లో, పట్టణాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ఈ సభలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సభల్లో బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల పాఠశాల సభ్యులు పాల్గొని ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు (ఫారం-6): 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు డిక్లరేషన్తో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్పులు, చేర్పులు (ఫారం-8): పేరు, వయస్సు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో తప్పులుంటే సవరణ కోసం తగిన ఆధారాలతో ఫారం-8 సమర్పించాలి. తొలగింపులు/అభ్యంతరాలు (ఫారం-7): అర్హత లేని వ్యక్తుల పేర్లు జాబితాలో ఉంటే అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఫారం-7 ద్వారా అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రజలు, ముఖ్యంగా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్ కోరారు. సభల నిర్వహణలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓలు, మున్సిపల్, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


